02.08.2024
నాటకరంగ రారాజు ‘రాఘవ’
యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం శుక్రవారం ఉదయం ప్రసిద్ధ నటుడు బళ్ళారి రాఘవ 145వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముందుగా పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ నాటకరంగానికి అనేక సేవలందించి రంగస్థలంపై విరాజిల్లిన రారాజు బళ్ళారి రాఘవ అని అన్నారు. తెలుగు నాటకాన్ని మహోన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన మహానటుడు బళ్ళారి రాఘవ అని, సాక్షాత్తు ఆ నటరాజే వేదికపైన ఉన్నాడా అన్నట్లు నటించి ప్రేక్షకాదరణ పొందిన గొప్ప నటుడని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతో, భావవిప్లవంతో, మహిళా పాత్రలను మహిళలే నటించాలని చెప్పటం ద్వారా తెలుగు నాటకరంగం తరువాతి కాలంలో దేదీప్యమానంగా వెలుగొందిందని అన్నారు. రాఘవ నటుడిగా బెర్నాడ్ షా, మహాత్మాగాంధీ, సుప్రసిద్ధ నటులు పులిపాటి వెంకటేశ్వర్లు, బందా కనకలింగేశ్వరరావు, స్థానం నరసింహారావు, ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు కట్టమంచి రామలింగారెడ్డి వంటి గొప్పవారిచే ప్రశంసలు అందుకొన్నారని అన్నారు. రాఘవ గొప్ప నటుడేకాక, ప్రసిద్ధ న్యాయవాదని, ఆయనలోని ప్రతిభను గుర్తించి ఆంగ్లేయ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిందని అన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు మాట్లాడుతూ ప్రచండ చాణక్య నాటక ప్రదర్శనలో చాణక్య పాత్ర పోషించిన బళ్ళారి రాఘవ స్మశాస సన్నివేశంలో హఠాత్తుగా వేదికపైకి కుక్కరాగా ‘ఓసీ! శునకరాజమా! మేమునూ నీకు లోకువయ్యామా’ అని సమయస్ఫూర్తిని ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలనందుకొన్నారని అన్నారు. రచయిత కొత్తపల్లి రామాంజనేయులు మాట్లాడుతూ బళ్ళారి రాఘవ చండికా, రైతుబిడ్డ వంటి సినిమాల్లో కూడా నటించారని అన్నారు. ఆయన ఎంతోమంది నాటకకర్తలకు, నటులకు ఆదర్శనీయులని అన్నారు.
జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకు నివాళి : పింగళి వెంకయ్య 147 జయంతి సందర్భంగా సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు కలసి వెంకయ్య చిత్రపటానికి పూలమాలను సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా.చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని, జాతీయ పతాకాన్ని మొదటిసారి ఆకుపచ్చ, కాషాయం రంగులతో తయారుచేయగా గాంధీగారి సూచనతో తెలుపురంగును చేర్చడంతో పాటు రాట్నం గుర్తు మధ్యలో వచ్చేలా రూపకల్పన చేశాడని అన్నారు. ఆ తరువాత 1947లో జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో రాట్నం స్థానంలో అశోక ధర్మచక్రాన్ని చేర్చారని అన్నారు. పింగళి వెంకయ్య చరమదశలో దారిద్య్రాన్ని అనుభవించారని, తాను మరణించిన తరువాత జాతీయ జెండాను తన పార్థివ దేహంపై కప్పాలని కోరిన గొప్ప దేశభక్తుడని అన్నారు. పింగళి వెంకయ్య గొప్ప భూగర్భ శాస్త్రవేత్తని, మైకాపై, వజ్రాలపై పరిశోధించి పుస్తకాలు రచించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం జూనియర్ అసిస్టెంట్ ఆర్.వెంకటరమణ, సిబ్బంది నీలకంఠేశ్వర్, సుమతి,హరి, పాఠకులు జి.సుబ్బారెడ్డి, సుబ్బయ్య, సురేష్, మహేష్, కె.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డా.ఎస్.వి. సుబ్బారెడ్డి
సంచాలకులు, ప్రజా సంబంధాలు
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప