06.08.2024
కవిత్వమే ఊపిరిగా జీవిస్తున్న విప్లవకవి ‘కె.శివారెడ్డి’
యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో
ప్రముఖ విప్లవ కవి కె.శివారెడ్డి 81వ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయపరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ కె.శివారెడ్డి విప్లవకవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించినా వారి కవితలు సుదీర్ఘంగా వుంటాయన్నారు. సామాజిక అంశాల్ని ఆయన పదేపదే ఆలోచించి అక్షరాలుగా మలచారన్నారు. ఆయన సాంస్కృతిక రంగంలో కవిత్వాన్ని ఆయుధంగా చేసి సామాజిక విధ్వంసాలమీద ఎక్కుపెట్టారన్నారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, కొత్త ఊపిరితో సరికొత్త ఊపుతో కవిత్వాన్ని శ్వాసించినా, నేడు ఆధునిక కవిత్వాన్ని శాసిస్తున్న మహాకవి శివారెడ్డి అని అన్నారు. రక్తంసూర్యుడు (1973), చర్య (1975), ఆసుపత్రిగీతం (1976), భారమితి (1983),, ఆమె ఎవరైతే మాత్రం (2009), వృత్తలేఖిని (2003), నేత్ర ధనస్సు (1978), మోహనా! ఓ మోహనా! (1988), అజేయం (1994), నా కలల నది అంచున (1997), వర్షం వర్షం (1999), జైత్రయాత్ర (1999), కవిసమయం (2000), గగనమంత తలతో, అంతర్జనం (2002), పొసగనివన్నీ (2008), అతను చరిత్ర (2005), శివారెడ్డి పీఠికలు (సంకలనకర్తలు: గుడిపాటి, పెన్నాశివరామకృష్ణ) (2014) వంటి పలు రచనలు శివారెడ్డి కలం నుండి జాలువారాయన్నారు. మోహనా! ఓ మోహనా! ఇంగ్లీషు భాషలోకి, అంతర్జనం కన్నడ భాషలోను అనువదించబడ్డాయన్నారు. వీరి ప్రతిభకు తార్కాణంగా కబీర్ సమ్మాన్ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, ‘సరస్వతీ సమ్మాన్’ లాంటి అనేక పురష్కారాలు పొందారన్నారు. బ్రౌన్ గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణ్ రావు మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం శివారెడ్డి నైజమన్నారు. ప్రతి చిన్న కవిలోనుండి వెలువడిన కొత్త భావాన్ని చూస్తే అభినందించడం వీరి సంస్కారమన్నారు. శివారెడ్డి ఏనాడూ తన మూలాలు మరచిపోలేదని, తన కవిత్వంలో బాల్యం అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఐదేళ్ళప్రాయంలో తల్లిని పోగొట్టుకున్న లోటు, ఎంతో వెలితిగా చుట్టూ ఎంతమంది వున్నా బిక్కుబిక్కుమనే భయం, గుండెల్లో గుసగుసలు పోతుంటుందనేవాడన్నారు. ఏభైఏళ్ళ సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ ఉద్యమాలతో శివారెడ్డి జీవితం ముడివడి వుందన్నారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి, బాల్యాన్ని బడికే కాకుండా, సేద్యం పనులకు సగం వినియోగిస్తూ, ఇంటి పని, వంటపనిలో తండ్రికి సహకారిగా ఉంటూ గడిపిన పల్లె జీవితపు కష్టాలు కన్నీళ్ళు తన కవిత్వంలో చూపిన కర్షక కవి శివారెడ్డి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం జూనియర్ అసిస్టెంట్ ఎం.మౌనిక, సిబ్బంది నీలకంఠేశ్వర్, సుమతి, హరి, పాఠకులు అనిల్, మహేష్, షేక్ షావల్లి, ప్రసాద్, రేవంత్, శ్రీకర్, చరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.